News

పట్టిసీమను వ్యతిరేకిస్తున్నామంటే నాలుక కోస్తాం


వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారిది కాదా అని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ 2009లో పోలవరం ప్రాజెక్ట్‌కి జాతీయాహోదా కోసం వైయస్సార్ కృషి చేస్తే చంద్రబాబు అడ్డుపడ్డాడని గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఏమి జరిగిందో నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం పట్టిసీమకు తాము వ్యతిరేకం అనటం వాస్తవం కాదని అన్నారు. 95 వేలకోట్ల రూపాయల సాగునీటి ప్రాజెక్టులకి వైయస్ 2004 నుంచి ఖర్చు చేశారని అన్నారు. పురుషోత్తమ పట్టణం ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఆయన జేసీ దివాకర్ రెడ్డి కాదని, జానీ వాకర్ రెడ్డి తాగొఛ్చి మాట్లాడితే గొప్పా? అని విమర్శించారు. జేసీని అడ్డం పెట్టుకుని ముఖమంత్రి మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. జేసీ గత చరిత్ర ఎవరికి తెలియదని, జేసీ జగన్‌ని తిడితే చంద్రబాబు ఆనందపడుతున్నారని అన్నారు. పట్టిసీమను తాము వ్యతిరేకిస్తున్నామంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నేరుగా నీళ్ళెలా ఇస్తారని, దమ్ముంటే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిస్తామని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జేసీ తన మాటలు వెనక్కు తీసుకోకపోతే ఆయన ఆఖరి రాజకీయ జీవితంలో చెడ్డ పేరు మిగిలిపోతుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో శాసనసభ్యునికి కాకుండా మరెవరికి ప్రమేయం ఉంటుందని ప్రశ్నించారు.